28, జూన్ 2024, శుక్రవారం

కమ్మని కాపురం

 

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-3019975312561056"

     crossorigin="anonymous"></script>

                          పోట్లాడుకోని వాళ్ళు పతీపత్నులే కారన్నది జగమెరిగిన మాట. భార్యాభర్తల మధ్య చాలా సీరియస్ గా పరిధిని మించి జరిగే గొడవ ఎంతటి భయోత్పాతాన్ని కలిగిస్తుందో, పరస్పర అనురాగంతో కమ్మని కాపురం లోని మాధుర్యాన్ని అనుభవించే దంపతుల మధ్య, ఇద్దరు చంటి పిల్లలు బొమ్మ కోసం తగువాడుకున్న రీతిలో చోటు చేసుకునే కలహం కాపురానికి మరింత కమ్మదనాన్నీ చూసేవారికి మరింత వినోదాన్నీ పంచిపెడతాయి. ఇదిగో...సరిగ్గా అలాంటి కలహమే ఈ “కమ్మని కాపురం”లో చోటు చేసుకుని, మనకి ఇంతింతనరాని హాస్యాన్ని బహుమతి గా అందిస్తోంది. చదవండి మరి....“సహరి” ఆన్ లైన్ పత్రికలో వచ్చిన నా కథ “కమ్మని కాపురం”



                                                  కమ్మని కాపురం 

             "రోజుకో టైము దానికి. నా పుణ్యం ఎలా ఉంటే అలా. ఓ రోజు ఆరింటికే వస్తుంది. ఓ రోజు ఏడూ..ఏడున్నరా అయినా అయిపూ అజా ఉండదు. నాకా నడుం నొప్పి. అదొచ్చి చీపురేశాక దేవుడికి దీపం పెట్టేసరికి ఓ రోజు ఆరున్నరా, ఓ రోజు తొమ్మిదీ!! ఎనిమిదైతే చాలు.. తద్దినం భోక్తలా చెంబుతో నీళ్లెట్టుక్కూచుంటాడీయన ఫలహారానికి. ఇడ్లీలోకి చట్నీ లేకపోతే అల్లుడైనా ఆవకాయ వేసుకు తింటాడు గాని మీ బావ మాత్రం నన్ను చట్నీ చేసుకుని నంజుకుంటాడు!" ఫోన్ లో చెల్లెలితో వాపోతోందావిడ. 

    "అంతా నీ చవటతనవేఁ.. పొద్దున్న ఆరింటికల్లా వస్తే రా... లేకపోతే ఫో అని పని మనిషికి గట్టిగా చెప్పలేవు. నా గురించి మాత్రం ఊరూ వాడా చాడీలు చెప్పి నా పరువు తియ్యగలవు"

     ఫోన్ ఠక్కుమని ఆపేసిందావిడ. 

        "ఇదిగో, పనిమనిషి జోలికి రావద్దని ఇప్పటికి లక్షసార్లు చెప్పాను మీకు. ఇవి గవర్నెంటుద్యోగాలు కావు హాఠ్ టూఠ్ అనడానికి. ఏ పని మనిషీ తిట్లు పడదు. దానిగ్గనక కోపం వచ్చి పని మానీసిందంటే నా పాట్లు కుక్కలు పడవు.. "

  "ఆ భయంతోనే నువ్వు దానికి లోకువైపోతున్నావు. ఇది గాకపోతే మరొహత్తి. అసలు నువ్విచ్చే రెండు వేలకి అది ఒరగబెడుతున్నదేవిఁటి.. ఇలా ఒయ్యారంగా చీపురు పట్టుకుని కాస్సేపు డాన్సాడుతుంది. తడిగుడ్డ కూడా రోజూ పెట్టదు. నాగాలు సరేసరి. ఈ నెల్లో ఎన్ని రోజులు నాగా పెట్టిందో నేను నోట్ చేశాను. రానీ దాన్ని.. నేనే మాట్లాడతా"

 "ఇదిగో. .." ఆవిడ గొంతు పెరిగింది. 

 "పనిమనిషి జోలికెళ్లారా... జాగర్త"

"గాడిద గుడ్డు. ఆఫ్ట్రాల్  పనిదానికి భయపడతావేమిటే నువ్వూ.. ఇవాళే దాని సంగతి తేల్చేస్తాన్ చూడు!"

        ఆవిడ భద్రకాళిలా చూస్తూ ఫోన్ టకటకా నొక్కింది. అవతలివాళ్లు ఫోన్ ఎత్తలేదు. ఆవిడ మళ్లీ మళ్లీ వాళ్లు ఫోన్ ఎత్తేదాకా చేస్తూనే ఉంది. 

 "అబ్బా... ఏవిఁటమ్మా పొద్దున్నే.. " అవతలి నుంచి విసుగ్గా వినిపించింది. 

 "మీ నాన్ననడుగు ఆ మాట. ఆయనకి చెప్పు ముందు. ఏ ముహూర్తాన రిటైరయేడో కానీ నా ప్రాణం తీసేస్తున్నాడు. దేవుడమ్మ ఎంత నమ్మకమైందో నీకు తెలుసు. బంగారం కనబడ్డా ముట్టుకోదు. పని శుభ్రంగా చేస్తుంది. అందుకే దానికి బోల్డు డిమాండ్. దాంతో ఆల్రెడీ ఒకసారి గొడవ పడ్డాడీయన. ఎలాగో బతిమాలీ బామాలీ నిలబెట్టుకున్నాను. ఇప్పుడు మళ్లీ గొడవాడతానని పూటకోసారి  బెదిరిస్తున్నాడు. నాకు బీపీ  పెరిగిపోతోంది. అసలు రిటైరయాక గొడవల మనిషైపోయాడు మీ నాన్న. మొన్న అపార్ట్ మెంట్  సెక్రటరీతో ఎందుకో గొడవాడేట్ట. ఇంతకు ముందు నన్ను చూస్తే ఎంతో గౌరవంగా పలకరించే మనిషి.. ఇప్పుడు ఆయనా పెళ్లామూ కూడా నన్ను చూసి మొహాలు తిప్పుకుని పోతున్నారు. ఏవండీ అంటే గవర్నర్ గారి రూల్సన్నీ మాట్లాడతాడీయన. భారత రాజ్యాంగం తిరగేస్తాడు. నా వల్ల కాదు. మీ నాన్నతో నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది. నిన్నటికి నిన్న ఏం చేశాడో తెలుసా.... " 

      తన చేతిలో ఫోన్ ఛటాలున లాక్కునే సరికి ఆవిడ ముందు బిత్తరపోయి, తర్వాత కాళికావతారం ఎత్తింది. 

   ఆయన ఫోన్ లో కూతురికి చెబుతున్నాడు..."చూడూ, గ్రూప్ వన్ ఆఫీసర్ గా పాతికేళ్ళు పని చేశాను. నేను రిటైర్ అయి వచ్చేస్తుంటే మా బాసు, ఎవరనుకుంటున్నావ్, ఐఏఎస్ ఆఫీసరు, ఆయన కూడా కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. అలాంటిది పనివాళ్లకీ, రూలూ రెగ్యులేషనూ తెలీని బచ్చా వెధవలకీ లొంగి, నోరు మూసుకు పడుంటానా?! ముమ్మాటికీ ఆ సెక్రటరీ ముండాకొడుకుదే తప్పు. వాడూ వాడి పెళ్లాం కాదు... బిల్డింగు యావన్మందీ మొహాలు తిప్పేసుకున్నా సరే నేనామాటే చెబుతా..."

      ఈసారి ఆవిడ ఫెటేలున ఫోన్ ఊడలాక్కుంది. 

"ఆఫీసర్ గా వెలగబెడితే చాలదు. బతకనేర్చిన తెలివితేటలు ఉండాలి ముందు. మీ నాన్నకి చెప్పుపనిమనిషీ, అపార్టుమెంటు సెక్రటరీ ఆయన మోచేతి కింది నౌకర్లు కాదు."

   ఆయన మళ్లీ ఫోన్ లాక్కోబోయాడు. కానీ ఆవిడ ఫోను గట్టిగా పట్టుకుని "మీ నాన్నతో నాకు ప్రాణం విసిగెత్తిపోతోంది. ఎప్పుడే గొడవ తెస్తాడో అని బెంగే. ఈసారి మళ్లీ ఎవరితోనైనా గొడవాడాడా... నేను చెప్పా పెట్టకుండా మా తమ్ముడి దగ్గరికి పోతాను. మీ నాన్న సంగతి నువ్వే చూసుకో" అంది. 

       ఆవిడ ఇంకా ఏదో అనబోతుండగా అవతలి నుంచి ఫోన్ కట్ అయింది. ఆవిడ కోపంగా ఫోన్ సోఫాలోకి విసిరేసి వంటింట్లోకి వెళ్లిపోయింది. 

      ఆయన పళ్లు పటపట లాడిస్తూ పేపర్లో తల దూర్చాడు.

                                                        *********

       మర్నాడు శనివారం! 

   తెల్లవారుజామునే ఆయన్ని లేపిందావిడ. 

 "లేవండి. ఇవాళ శనివారం. మీకసలే ఏల్నాటి శని. తొందరగా లేచి స్నానం చేస్తే వెంకటేశ్వర స్వామి పూజ చేయిస్తా"

             "నా చేత పూజ నువ్వు చేయించేదేవిఁటి?! నేను పువ్వు పెట్టలేనా.. అగ్గిపుల్ల గీసి దీపం వెలిగించలేనా.. స్తోత్రాలూ శ్లోకాలూ చదువుకోలేనా" 

 "ఆఁ.. అన్నీ చెయ్యగలరు. పువ్వులన్నీ ఒక్కసారే బుట్టలోంచి తీసి పిడికిట్లో ముద్ద చేసేసి అందరు దేవుళ్లకీ తలా కాస్త ముద్దా పెట్టగలరు. దీపం కుందిలో అరచెంచాడు నూనీ, బల్ల మీద చెంచాడు నూనీ. పదంటే పది నిమిషాల్లో సుప్రభాతం, స్తోత్రం, అష్టోత్తరం, గోవిందనామాలు అన్నీ అయిపోతాయి. ఏ దిక్కుమాలిన చదువు చదివేరో గాని మీరు సుప్రభాతం చదువుతుంటే ఏడుపొస్తుంది. నాతో బాటు ఆ దేవుడు కూడా ఏడవడం ఎందుగ్గానీ తొరగా తెవలండి." 

          ఆయన నోరెత్తకుండా లేచి, స్నానం చేసి పట్టుపంచె కట్టుకుని దేవుడి మందిరం ముందుకొచ్చేడు. ఆవిడ దగ్గరుండి శాస్త్రోక్తంగా పూజ చేయించింది. 

      "ఆఁ... నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు హారతివ్వండి"

    ఆయన హారతిచ్చి, హారతి రేకు కింద పెట్టి చెయ్యి వెనక్కి తీసుకుంటూండగా ఆ చెయ్యి వెళ్లి, వెండి గ్లాసు నిండా పోసి నైవేద్యం పెట్టిన పాలకి తగిలింది. గ్లాసు తొణికి, ఇంచుమించు సగం పాలు ఒలికిపోయాయి. ఆ పాలల్లో కొన్ని చుక్కలు గాల్లో ప్రయాణించి, పక్కనే ఉన్న హారతి రేకు మీద పడి, వెలుగుతూ ఉన్న కర్పూరం కాస్తా  కొండెక్కిపోయింది. 

   "ఆఁ... ఆఁ... ఆఁ..." పాలగ్లాసు తొణకగానే మొదలైన ఆవిడ ఆక్రోశం, హారతి కొండెక్కేసరికి ఆర్తనాదంగా మారిపోయింది. 

  "ష్ష్... అరవకే.... " ఆయన కంగారు అణచుకుంటూ గబుక్కున పైకి లేచి పక్కనే ఉన్న దండెం మీద చేతికందిన బట్ట లాగి, పాల ప్రవాహం మీద వేసేశాడు. 

  "ఆఁ... ఆఁ... అయ్యో.. అయ్యో" పాలు పీల్చుకుంటున్న తన పట్టు జాకెట్టుని చూసి ఆవిడకి ఏడుపొక్కటే తరవాయి. 

     "చాలాపు నీ గోల. ఇక్కడ అంగుళం ఖాళీ ఉందా?! కొబ్బరి కాయ, అరటిపళ్లు, వడపప్పు, పానకం, చలిమిడి, పాలు, డ్రై ఫ్రూట్స్... చెయ్యి ఎటు తిప్పినా ఏదో ఒకటి తగుల్తుంది. ఇండియా మేప్ కూడా ఇంత గజిబిజిగా ఉండదు. కనిపించని దేవుడికి ఇన్ని నైవేద్యాలు. ఏడాదికి నాలుగు పట్టుచీరలు కొనే మొగుడికి ఒక్ఖ రెండు రకాలు చేసి  పెట్టడానికి గొల్లున ఏడుపు. వచ్చే వారం నుంచి నువ్వే చేసుకో పూజ. నా వల్ల కాదు"

    "తప్పు నా మీదకి తొయ్యడమే గాని నీ తప్పు నువ్వు ఎప్పుడూ ఒప్పుకోవు" ఆవిడ రౌద్రంగా అరిచింది. 

   "ఒక్క మచ్చ లేకుండా ఎక్సలెంట్ మార్కుతో రిటైరయేను. నా తప్పేవిఁటి మధ్యలో?!" ఆయన లేచి వెళ్లిపోయేడు. వెళుతూ వెళుతూ, "టిఫిను తొందరగా పట్రా. తెల్లారుజామునే లేపేశావు. ఆకలి దంచేస్తోంది. మరో ఇడ్లీ ఎక్కువ పెట్టు. కారప్పొడిలో నెయ్యి బాగా వెయ్యి. ముందు అర్జంటుగా కాఫీ పట్రా" అనేసి వెళ్లిపోయేడు. 

  ఆవిడ పళ్ళు నూరుకుంటూ పైకి లేచింది.  

               సాయంత్రం ఆరింటికి కూతురు ఫోన్ చేసింది. 

"ఏం చేస్తున్నావమ్మా" అని ఆ పిల్ల అడిగీ అడగడంతోనే ఆవిడ దండకం మొదలెట్టింది. "ఏం చేస్తానూ... చపాతీ పిండి పిసుక్కుంటున్నాను. ఇల్లే వైకుంఠం... వంటిల్లే కైలాసం!! వన్నాట్ ఫైవ్ జానకమ్మ గారూ ఆయనా చాక్కగా రోజూ గుడికెళ్లి, ప్రశాంతంగా ఓ గంట గడిపి వస్తారు. టూ నాట్ సెవెన్ సీతగారూ ఆయనా కలిసి తిరపతి వెళ్ళేరు. నా బతుకు మాత్రం ఇల్లో నారాయణ వేణుగోవిందా...ఏడుకొండలవాడు దిగొచ్చి రావయ్యా అన్నా మీ నాన్న కదలరు. ఇంట్లో పూజే అంత కమ్మగా చేస్తున్నారు. పేపరూ టివీ తప్ప మరో లోకం లేదు గదా మహానుభావుడికి... " అంది.

  అటు నించి కూతురు, “అమ్మా, ఇల్లు అద్దేకిచ్చేసి నువ్వూ నాన్నామా దగ్గరకొచ్చెయ్యండి. రొజూ ఫోన్లో మీ గొడవలు వినలేక చస్తున్నాను. కుక్కల్లా కొట్టుకుంటున్నారిద్దరూ. మీ గొడవలు కాదు గాని నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది.” అంది.

          కూతురి మాటలు విని, ఆవిడ "ఏవిఁటీ.. ఈ ఇల్లద్దెకిచ్చేసి మీ దగ్గరకొచ్చెయ్యాలా...కుక్కల్లా కొట్టుకుంటున్నామా...!! హవ్వ, ఎవరైనా వింటే నవ్విపోతారు. పెళ్లయిన ఇన్నేళ్లకి ఆయన రిటైరై ఖాళీగా ఉండబట్టి  ఏదో కాస్త మంచీ చెడ్డా మాటాడుకుంటున్నాం. చిలకా గోరింకల్లా హాయిగా కాపరం చేస్తున్నాం. ఇన్నాళ్లూ మా చుట్టూ కాపలా భటుల్లా ఎవరో ఒకరు. ఎప్పటికైనా ఇద్దరం కాస్త హాయిగా ఉంటామా అనుకునేదాన్ని. ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ  మీ నాన్నకి నోట్లో ముద్దా వీధిలో కాలూ!! పిచ్చి మనిషి ఏనాడైనా తీరిగ్గా తిని ఎరుగుదురా..?! ఇప్పుడు కూడా ఏదో తింటున్నారు గానీ పాపం ఆయనకి నాలుగూ చేసి పెడదామంటే నాకు ఓపికే ఉండట్లేదు. మొన్నటికి మొన్న పొద్దున్నే లేవలేకపోయాను. ఆయనెంత కంగారు పడ్డారో... వద్దు వద్దంటున్నా కాఫీ కలిపి తెచ్చి అందించేరు. ఎంత బాగా కలిపారో...నాకెంత సంతోషమనిపించిందో..!  మొన్న నా పుట్టినరోజుకి ఇంట్లో వంట చెయ్యకు అని హోటలుకి తీసికెళ్లేరు...”  ఫుల్ స్టాప్ కామాల్లేకుండా చెప్పుకుపోతున్న ఆవిడ,  "ఆపు. మళ్లీ పొద్దున్నే నాకు ఫోన్ చేశావో.... " అని ఓ అరుపు అరిచి  కూతురు ఫోన్ పెట్టెయ్యడం చూసి, "ఏవిఁటో ఈ పిల్లలు.. " అంటూ ఫోన్ పెట్టేసి, "ఏవండీ... చపాతీల్లోకి కూరేం చెయ్యమంటారు" అంటూ హాల్లోకి బైల్దేరింది!! 

                                                  ***************

 





25, జూన్ 2024, మంగళవారం

ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవింద

 


<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-3019975312561056"

     crossorigin="anonymous"></script>



                             ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవింద 

సరిగ్గా పదేళ్ళ కిందట ఒక పౌర్ణమి కి మా వైభవ వెంకన్న పంచామృతాభిషేకం చూసి వచ్చి ఆ ఆనందపు మత్తు లో దాని గురించి నా బ్లాగులో రాసుకున్నాను ఇలా...... చదవాలనుకున్నవారు చదవండి

                            ఈ రోజు పౌర్ణమి.వెంకన్న నిజరూప దర్శనం చేసుకుని ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఈ రోజు స్వామికి విశేషాభిషేకాలు చేస్తారు.మేం వెళ్లేసరికి క్షీరసాగరశయనుడికి క్షీరాభిషేకం పూర్తయి..దధ్యాభిషేకానికి వచ్చారు. "రాధా క్యోం గోరీ మై క్యోం కాలా.." అంటూ చిన్నబుచ్చుకున్న నల్లనయ్యకి "శరశ్చంద్ర చంద్రికా ధవళ"మైన పెరుగు మైపూత పూసి తాత్కాలికంగా తెల్లనయ్యను చేశారు.తరువాత తేనెలాంటి మనసున్న తండ్రిని నిలువెల్లా తేనెతో తానమాడించారు.    "ఏడుకొండలవాడా...వెంకటరమణా..ఆపదమొక్కులవాడా..అనాధరక్షకా...గోవిందా...గోవింద" అంటూ ఎలుగెత్తి పిలిచే భక్తుల మొర వినీ వినడంతోనే పొయ్యి సెగ సోకిన నేతిలా కరిగిపోయే ఆపద్బాంధవుణ్ణి పూర్తిగా నేతిలో ముంచేసి మరింత కరిగించేశారు.అక్కడితో అయిందా..అమ్మ చూడకుండా గబుక్కుని పందార అందుకుని దొరికినంత తినేద్దామన్న ఆత్రుతతో అల్లరి బుజ్జాయి అలమర పై అరలో ఉన్న పంచదార డబ్బా తీసి పొరబాటున దాన్ని ఒళ్లంతా ఒంపుకున్నట్టు...స్వామి తనువంతటినీ పంచదారతో నింపేశారు. హవ్వ...అసలే యశొదమ్మకి కన్నయ్య మీద బోలెడంత అనుమానం. ఆవిడ చూస్తే ఇంకేమైనా ఉందా.."కన్నా..పాలూ పెరుగుల్తో బాటు పంచదార కూడా తీస్తున్నావా.." అని కూకలేసి మళ్లీ ఏ రోటికో కట్టెయ్యదూ..?? అందుకే...అమ్మకి కూడా కనిపించకుందా కన్నయ్య ఎక్కడో వెళ్లి దాక్కున్నట్టు స్వామిని పూర్తిగా మాయం చేసేస్తూ కరెంటు పోయింది. ఏ కారణం చేతనో గాని వెంటనే జెనరేటర్ కూడా వెయ్యలేదు.

                                        కాస్సేపున్నాక విద్యుత్కాంతి మళ్లీ తిరిగి వచ్చింది. దోబూచాట  పూర్తయినట్టూ  స్వామి మళ్లీ కనిపించాడు. ఇక ఇక్కడి పూజారి గారున్నారేం..ఆయనకి స్వామి ఓ చంటి పిల్లాడు. బుల్లి బాబుకి తిలకం దిద్దీ కాటుక పెట్టీ ఆడపిల్లలా గౌను తొడిగీ అమ్మ ప్రేమ మీరా ఎలా ఆడుకుంటుందో ఆయన వెంకన్నతో అలా ఆడుకుంటారు. అభిషేకాల చివరాఖరున గంధం ముద్దలతో ఆయన చేసే మాయ చూసి తీరవలసిందే గాని చెబితే చాలదు. స్వామి వక్షస్థలం నించి పైకి అలా అలా గంధం ముద్దలు మెదుపుతూ మెదుపుతూ పదంటే పది నిమిషాల్లో రాముణ్ణి కాస్తా రామబంటుని చేసేస్తారాయన. నోటి దగ్గర కాస్త ఎత్తుగా అమర్చిన గంధపు ముద్ద వెంకన్నకి ఇట్టే వానర రూపాన్ని తెచ్చి పెట్టేస్తుంది. అవును మరి...గుండె చీల్చి రామదర్శనం చేయించినవాడు మారుతి..మరిక రామన్న త్వమేవాహం...త్వమేవాహం అనకుండా ఉంటాడా..?? అయిందా..గంధమూ పసుపూ అయ్యాక ఆఖరుగా కుంకుమ. నారాయణి "సర్వారుణ" అవగా లేనిది నారాయణుడికేనా తక్కువ..? ఆపాదమస్తకమూ హరిద్రాకుంకుమాంకితమైన స్వామి రూపం..."నారాయణ-నారాయణి"..!! చూసినవాడి బతుకు పావనం! జేకొట్టినవాడి జీవితం ధన్యం!!

24, జూన్ 2024, సోమవారం

యోగక్షేమం వహామ్యహం

 

   తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ప్రత్యేక సంచిక "తెలంగాణ తోరణం" లో ప్రచురించబడిన నా కథ

                                     యోగక్షేమం వహామ్యహం 

   "మీకోసం ఎవరో ఒక పెద్దావిడ, ఒకాయన వచ్చారు సార్.ఈ కాగితం మీకిమ్మన్నారు..." వినయంగా అంటూ చిన్న కాగితం ముక్క ఇచ్చాడు  సెక్రటరీ జీవన్. 

 "పెద్దావిడా... " ఆశ్చర్యంగా చూశాడు మూర్తి. "అమ్మేమో" అన్న ఆశ మనసులో చిచ్చుబుడ్డిలా గుప్పున వెలిగి... ఆరిపోయింది. అమ్మ ఎలా వస్తుంది?!  ఇందు అమ్మ ఊసే ఎత్తదు. ఉన్న ఒక్కగానొక్క సంతానం హృదయ్ కి నానమ్మ గురించే తెలియదు. ఇంక తను లివర్ కేన్సర్ తో ఆస్పత్రిలో ఉన్నట్టు అమ్మకెలా తెలుస్తుంది?!  

  మూర్తి అనాసక్తిగానే కాగితం చదివాడు..."మూర్తీ, నీ గురించి తెలిసి, అమ్మా నేనూ వచ్చాం...రాఘవ"

           అది చదువుతూనే ఒక్క ఉదుటున లేచి కూచున్నాడు మూర్తి. 

 "వాళ్లని లోపలికి తీసుకురా జీవన్. బైట డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టు." గబగబా చెప్పి, వెనక్కి జేరబడ్డాడు. 

  జీవన్ మొహంలో ఆశ్చర్యం దాచుకుంటూ తల ఊపి వెళ్లిపోయాడు. 

 మూర్తి తలుపు వైపే దృష్టి కేంద్రీకరించాడు. 

          అమ్మని చూసి పదేళ్ళూ,  తనింటి నుంచి గెంటేసి...ఇరవై సంవత్సరాలు అయింది!! అవును.. ఒక మనిషి తనంతట తాను ఇంట్లోంచి వెళ్లిపోయే పరిస్థితులు కల్పిస్తే అది గెంటెయ్యడమే. ఇందు అలాంటి పరిస్ధితుల్ని భేషుగ్గా కల్పించింది. తను చూసీ చూడనట్లు ఊరుకున్నాడు. నాన్న కూడా లేని అమ్మ.. ఏకాకి అయి, అయినా సరే దర్జాగా వెళ్లిపోయింది. అమ్మ ధీరోదాత్తురాలు! అలాంటి అమ్మని తను వెళ్లగొట్టేశాడు!  అమ్మ వెళ్లిపోయినందుకు తను ఏనాడూ బాధపడలేదు సరికదా అమ్మకి పల్లెలోనే బావుంటుందని కూడా అనుకున్నాడు. 

      ఇదిగో, వారం రోజుల క్రితం డాక్టర్ తనకి లివర్ కేన్సర్ అని ఖరారు చేశాక, మళ్లీ అమ్మ పదే పదే గుర్తుకు రావడం మొదలైంది.  పెద్దయాక కూడా తనకేమైనా ఒంట్లో బాగాలేకపోతే అమ్మ ఎలా లాలించేదో గుర్తొచ్చింది. ఈ యాభై ఏళ్ల వయసులో, మృత్యువు పొంచి చూస్తున్న వేళ, మళ్లీ అలాంటి లాలన కోసం మనసు కొట్టుకుపోయింది!

           తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. తెల్లగా, పొట్టిగా, బక్కపల్చగా ఉన్న  ఆకృతి లోపలికి వచ్చింది. నిర్మలంగా ఉన్న ఆ మొహంలో.. కళ్లజోడు వెనుక నుంచీ కూడా ఆ చూపు ఎంత దయార్ద్రంగా ఉందీ?! ఎంత నిష్కల్మషంగా, ప్రేమగా ఉందో?! 

 "అమ్మా.. " మూర్తి అప్రయత్నంగా చెయ్యి చాపాడు. 

  సావిత్రమ్మ చప్పున ముందుకొచ్చి కొడుకు చెయ్యి అందుకుంది. 

 "అమ్మా.... " మూర్తి కళ్లు నీళ్లతో నిండిపోయాయి.   "నేనూ నాన్న దగ్గరికి వెళ్లిపోతున్నానమ్మా"

  "నీ మొహం" సావిత్రమ్మ  ప్రేమగా కొడుకు బుగ్గలు పుణికింది. "నన్ను దాటించకుండా నువ్వెక్కడికి వెళతావురా.. నా పూజలన్నీ ఏమైపోవాలీ?" అంటూ పక్కనే ఉన్న రాఘవ వైపు చూసి "చిన్నప్పటి నుంచీ ఇంతే... ఉత్త భయస్ధుడు." అంటూ నవ్వింది

      అమ్మ మాటకి ఒక్కసారిగా పుంజుకున్నాడు మూర్తి. ధైర్యాన్ని సిరంజిలోకి ఎక్కించి, నరాల్లోకి పంపించినట్టయింది. అవును... ఇప్పట్లో తనకేమీ కాదు. అమ్మ ఎక్కడున్నా తను బావుండాలని పూజలు చేస్తూనే ఉంటుంది. డాక్టర్లు చెబుతూనే ఉన్నారు కదా... చాలా ఎర్లీ స్టేజి.. భయపడవలసిందేమీ లేదూ అని. అది అమ్మ పూజల వల్లే! అమ్మ ఎంత నిష్టగా పూజ చేస్తుందో తనకి తెలుసు. ఇందుకి షో ఎక్కువ.

 "అమ్మా.. నీకెలా తెలిసింది?!"

 "కాకొచ్చి కబురు చెప్పింది గాని, నాన్నా, నేను నీ దగ్గర ఓ వారం రోజులు ఉందామనుకుంటున్నానురా."

"అమ్మా...!" మూర్తి ఆనందం రెట్టింపు అయింది. "నన్ను చూసేసి వెళ్లిపోతావేమోనని భయపడుతున్నానమ్మా!"

"పిచ్చితండ్రి..అలా ఎలా వెళతాను? వీలైతే నిన్ను నాతో బాటు తీసుకువెళ్లాలని ఉంది నాకు!"

   మూర్తి మాట్లాడలేదు.. అయిష్టతతో కాదు.. "అమ్మతో కలిసి వెళతానా" అన్న అపనమ్మకంతో.

  రాఘవ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

  "కాలక్షేపానికి విను..!" సావిత్రమ్మ  తన సెల్ కొడుకు తల పక్కన పెట్టింది. 

  "న కాంక్షే విజయం కృష్ణ.. నచ రాజ్యం సుఖానిచ" ఘంటసాల భగవద్గీత వస్తోంది. 

  "అమ్మా.. " చప్పున మళ్లీ మృత్యుభయం కమ్ముకుంది మూర్తిని. "నేను చచ్చిపోతానని.. చచ్చిపోబోయే ముందు భగవద్గీత వినిపిస్తున్నావా..?!"

 సావిత్రమ్మ  చల్లగా నవ్వింది. "ఇంచుమించు నలభై సంవత్సరాల నుంచీ భగవద్గీత నిత్యం పారాయణ చేస్తున్నాను నేను. చచ్చిపోతాననే చదువుతున్నానా?!"

   మూర్తి మాట్లాడలేదు! 

 "ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఈనాడు చెబుతున్నారు చూశావా... యుగయుగాల కిందటే ఆ ఆర్ట్ ని గ్రంధస్థం చేసి మనకి అందించాడు  కృష్ణ పరమాత్మ! ఆ స్వామి ఉన్నాడూ అని నువ్వు ఎంత దృఢంగా నమ్ముతావో, సమస్త రకాల బాధల నుంచీ నువ్వు అంత దూరమవుతావు! శారీరకంగా సుఖపడటానికి సంపాదన ఎంత అవసరమో, మనశ్శాంతికి ఆధ్యాత్మికత అంత అవసరం! పెద్దవాళ్లు మనతో బాటే ఉంటే, మన చెయ్యి పుచ్చుకుని ఆధ్యాత్మికత బాట పట్టిస్తారు! నేనిప్పుడు చేస్తున్నది అదే! ప్రశాంతంగా, ఏమీ ఆలోచించకుండా విను! నీ మనసుకి శాంతి దొరుకుతుందో లేదో చూడు!"

 మంత్రముగ్ధుడిలా భగవద్గీత వినడం ప్రారంభించాడు మూర్తి.

"దేహినోస్మిన్ యధా దేహి.. కౌమారం యవ్వనం జరా.. "

   అవును. చిన్నప్పుడు పరిగెడుతూ క్రికెట్ ఆడిన శక్తి తనకిప్పుడు లేదు. బాల్యం, యవ్వనం దాటేశాడు. బీపీ, సుగర్ శరీరాన్ని లొంగదీసుకున్నాయి. స్టేజి మీద తన పాత్ర చివరికి వస్తుంటే, ఇహ తెర వెనక్కి తప్పుకోవలసిన సమయం ఆసన్నమైందని వేరే ఎవరో చెప్పాలా?! ఎటూ తెరమరుగవడం తప్పనిసరి అయినప్పుడు, ఏ రకంగా అయితేనేమీ?! 

 "అమ్మా... "

"ఏమిటి నాన్నా?!"

"డిశ్చార్జ్ చేశాక, నువ్వూ, నేనూ కలిసి మన ఊరు వెళదాం! నీ దగ్గర కొన్నాళ్లుంటానమ్మా"

                                                    **********

        చిన్న డాబా ఇల్లు! ముందు వైపు మథు మాలతి, సన్నజాజి, విరజాజి, వెనుక వైపు ఆనప, బీర, కాకర తీగెలతో కప్పుకుపోయి, లతాగృహంలా కనిపిస్తోంది. విశాలమైన పెరట్లో, తూర్పున గోశాల. తాటాకు కప్పిన ఆ పాక మీద కాశీరత్నం పూలతీగె నిండుగా విస్తరించి, పాకలో గోమాతకి పువ్వుల గొడుగు పట్టినట్టుంది! 

      ఇంట్లో కాలు పెడుతూనే పెరట్లో నూతి దగ్గరికి వెళ్లి, కాళ్లూ, చేతులూ, మొహం కడుక్కుని, గోశాల వైపు నడిచింది సావిత్రమ్మ. చిన్నపిల్లాడిలా తల్లి వెనకే వస్తున్న మూర్తి, తనూ కాళ్లూ, చేతులూ కడుక్కుని, గోశాలలోకి వెళ్లాడు! 

  "బావున్నావా తల్లీ.. " ఆవు గంగడోలు నిమురుతూ ఆప్యాయంగా అడిగింది సావిత్రమ్మ. 

   ఆవు ఆమె రాకకి ఆనందిస్తున్నట్టు మెడ సాచి సావిత్రమ్మకి మరింత దగ్గరగా మొహం పెట్టింది. పక్కనే మరో చిన్న గుంజకి కట్టేసి ఉన్న దూడ, తల్లిని రాసుకుంటూ ముందుకొచ్చి సావిత్రమ్మ తొడల్ని తలతో పొడిచింది. 

"అయ్యో, నిన్ను మర్చిపోలేదురా నాన్నా.. " సావిత్రమ్మ వంగి దూడని నిమురుతూ ముద్దు చేసింది. 

 "ఇది సురభి! ఈ బుజ్జి దూడ గౌరి!" అని చెబుతూ,  కొడుకు జబ్బ పట్టుకుని సురభి దగ్గరగా తీసుకువెళ్లింది. మూర్తి చెయ్యి పట్టుకుని సురభి గంగడోలు నిమిరించింది. 

      తర్వాత చేతులు జోడించి నమస్కారం చేస్తూ, "అమ్మా, సురభీ! నీకు తెలియనిదేముంది.. వీడు నా ఒక్కగానొక్క పిల్లాడు! వీణ్ణి చల్లగా చూడాలి నువ్వు!" అంది. 

       ఆ మర్నాటి నుంచీ మూర్తి దినచర్య సరికొత్తగా మొదలైంది. తెల్లవారుజామునే అమ్మతో బాటూ లేవడం, స్నానం చేసి, దేవుడి ముందు దీపం వెలిగించి ఒక పావుగంట సేపు నిశ్చలంగా ధ్యానం చేయడం. తర్వాత గోశాలకు వెళ్లి, సురభి, గౌరి ఇద్దరి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, సురభి గంగడోలు నిమురుతూ మృత్యుంజయ మహా మంత్రాన్ని ముమ్మారు చెప్పడం. అదయాక, అలా పొలాల వైపు వాకింగ్! 

           సావిత్రమ్మ కబురంపగా వచ్చిన ఆయుర్వేద వైద్యుడు ఏదో లేహ్యం, గుళికలూ ఇచ్చాడు. వేళకల్లా అవి వేసుకోవడం. అమ్మ పెట్టే సాత్వికాహారాన్ని తీసుకోవడం! రెండు పూటలా గోరువెచ్చని ఆవుపాలు తాగడం! పుస్తకాలు చదువుకోవడం...!!

     తల్లి బుక్ షెల్ఫ్ లో కొన్ని ఇంగ్లీషు పుస్తకాలు కూడా కనిపించాయి మూర్తికి. అవి ఎవరు చదువుతారా అనుకుంటుండగా, ఒకరోజు ఒక పుస్తకం తెచ్చిస్తూ, "చదువు. చాలా బావుంది" అంది సావిత్రమ్మ.

 అమిత్ వైద్య రాసిన “Holy Cancer - How a Cow saved my life అనే  పుస్తకం అది. 

మూర్తి ఆశ్చర్యంగా, “చాలా బావుందా...అమ్మా  నువ్వు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నావు? ఎవరు నేర్పారు?!" అని అడిగాడు.

"చెబుతాను. విను. ఆరోజు ఆస్పత్రిలో నీ గురించి నాకు ఎలా తెలిసిందీ అని అడిగావు కదా.. నాకు ఇంగ్లీష్ నేర్పిందీ..స్మార్ట్ ఫోన్ కొనిచ్చి, దాని వాడకం నేర్పిందీ, నీ అనారోగ్యం గురించి చెప్పిందీ అంతా ఒకరే.. "

"ఎవరమ్మా. ." మూర్తి కుతూహలం రెట్టింపు అయింది. 

"చెబుతున్నా..! నేను నీ దగ్గర నుంచి వచ్చేసిన చాలా కాలానికి  ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. "నానమ్మా... నేను నీ మనవణ్ణి" అన్నాడు అవతలి నుంచి. నేను నిలువునా చలించిపోయాను. నేను వచ్చేసే టైంకి వాడు ఏడాది వాడు. ఇప్పుడు పదహారేళ్లు. "నానమ్మా....నేను నీ దగ్గరకి రావచ్చా" అని అడిగాడు. కళ్లనీళ్లొచ్చాయి నాకు. రమ్మన్నాను. వచ్చాడు. 

          "మా ఇంట్లో ఎవ్వరూ ఉండరు... ఆ సైలెన్స్.. ఐ హేట్ నానమ్మా" అని వాడు అంటూంటే నాకు మీ నాన్నగారే గుర్తొచ్చారు. ఇల్లనేది సందడిగా ఉండాలనేవారాయన. నీ సెల్ లో నా ఫోన్ నంబర్ పట్టుకుని, రహస్యంగా వచ్చాడు వాడు. ఇప్పుడు కనీసం నెలకోసారైనా వస్తాడు. సురభి, గౌరి వాడు పెట్టిన పేర్లే. ఈ ఇల్లు ప్రస్తుతం నడుస్తున్నది వాడి ఊపిరితోనే!!"

                మూర్తి నోట మాట రాలేదు! కానీ రక్తం ఉరకలేస్తోంది. గుండె గంగావతరణంలా "తొందర తొందర నడకల వెను వెన్కనె వేల్పుటేరు" లా పొంగుతోంది!! 

                                                    **********

     పదేళ్ల తర్వాత.. 

  "ఇందిరా ఫార్మా" కంపెనీ అధినేత హృదయ్ తండ్రి రామమూర్తి షష్ఠిపూర్తి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి! ఎనభై ఏళ్ల ముదివగ్గు మూర్తి తల్లి సావిత్రమ్మ సోఫాలో కూర్చుని ఉంది. 

      మూర్తి లేచి, "నేను ఎక్కువగా మాట్లాడటానికి ఏమీ లేదు గానీ, రెండే రెండు మాటలు చెబుతాను. మొదటిది... మీ ఇళ్లల్లో పెద్దవాళ్లు ఉంటే వాళ్లని పెన్నిధిలా కాపాడుకోండి. మనం ఎలా బతకాలో... ఎలా బతికితే జీవిస్తామో చెప్పగలిగేది వాళ్లే! రెండోది కోరిక తీరడం కోసం భగవత్ప్రార్ధన చెయ్యకండి. ఫలితం ఉండదు. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఆ పరమేశ్వరుని ఆశ్రయించండి. ఫలితం చక్రవడ్డీలా పెరుగుతుంది!! ఇక అందరూ లేచి తృప్తిగా భోజనం చెయ్యండి!" అన్నాడు. 

              సావిత్రమ్మ, హృదయ్ ఇద్దరూ చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకున్నారు! 

  "అనన్యాశ్చింతయంతో మాం.." మైక్ లోంచి ఘంటసాల స్వరంతో శ్రీకృష్ణ పరమాత్మ పలుకుతున్నాడు! 

                                              ************

                        

 

                     



  


 

24, మే 2024, శుక్రవారం

       తిరుపతి కి చెందిన "తెలుగు భాషోద్యమ సమితి" వారు ఇటీవల నిర్వహించిన కథల పోటీ లో ప్రథమ బహుమతి గెలుచుకున్న నా కథ

                                               "గూటికి చేరిన పక్షులు"   


                                             గూటికి చేరిన పక్షులు

                 ఎనభై మూడు సంవత్సరాల పండుటాకు సోమయాజులుగారు శివైక్యం చెందారు. ఇల్లంతా బంధుబలగంతో నిండి ఉంది. కొడుకులు ముగ్గురూ  కలిసి కర్మకాండ నిర్వహిస్తున్నారు. యాజులుగారు ఎంత ధార్మికుడో అంత మానవతావాది. తెల్లవారుజామునే గోదావరిలో స్నానం చేసి నమకచమకాలు పారాయణ చెయ్యనిదే పచ్చి గంగ ముట్టని ఆ వృద్ధుడు, అట్టడుగు వర్గాల వారందరినీ ఎంతలా ఆదరించి ఎన్నెన్ని సహాయాలు చేశాడో ఆ భగవంతునికే ఎరుక. చేసేదేదో గుప్తదానమై ఉండాలని విశ్వసించే ఆయన చేసిన పనులేవీ భార్యకి కూడా సాకల్యంగా తెలియవు. యాజులుగారు కన్ను మూసిన క్షణం నుంచీ మాత్రం ఆయన చేసిన ధర్మకార్యాలన్నీ ప్రాణం పోసుకుని గుమ్మంలోకి నడిచొస్తున్నాయి.

         పండక్కీ పబ్బానికీ యాజులుగారి భార్య సావిత్రమ్మగారికి వంటలో సహాయం చేసే కాంతమ్మ పిలవా పెట్టకుండా కూతుర్నీ చెల్లెల్నీ సాయం తీసుకుని, ‘‘వంట నేను చేసి పెడతానమ్మా’’ అంటూ వంటింట్లోకి జొరబడింది. 

    ‘‘బేపనోల్లు తినేదే పప్పూ కూరా’’ అంటూ తట్టల కొద్దీ కూరలు తెచ్చి గుమ్మంలో పోసేసి వెళుతున్నారు కూరలవాళ్లు

 పనిమనిషి ఎల్లమ్మతో బాటు దాని కూతురూ తోడికోడలూ కూడా వచ్చి ఇంటెడు పనీ చేస్తున్నారు.

 ఎవ్వరూ ఒక్క పావలా అడగడం లేదు. ఇచ్చినా తీసుకోవడం లేదు.

   ‘‘ఇన్నాళ్లూ ఆ బాబు మాకు ఎంత చేసేడో లెక్కే లేదు. ఇప్పుడైనా ఆ బాబుకి సెయ్యకపోతే కుక్క జన్మెత్తుతాం’’ అంటున్నారు ముక్తకంఠంతో

    ‘‘మీరెలా ఛస్తే నాకే’’మని చనిపోయినవారి కొడుకుల దగ్గర్నించి వేలకి వేలు గుంజే పురోహితుడు సూరిశాస్త్రి సైతం, ‘‘బాబూ, ఎవరి దగ్గరైనా బేరాలాడతాను గాని యాజులుగారి కొడుకుల దగ్గర మాత్రం కాదు. మీరు రూపాయి బిళ్ల చేతిలో పెట్టినా ఆనందంగా స్వీకరిస్తాను. నాకెంత ఇవ్వాలో అన్న ఆలోచన వదిలేసి, నాన్నగారికి జరగవలసినవన్నీ లోభం లేకుండా జరిపించండి చాలు!’’ అన్నాడు

               పల్లెవాసనలు ఇంకా వదలని పట్నం రాజమండ్రి. పవిత్ర గోదావరీ తీరాన పదిహేను వందల గజాల స్థలంలో లంకంత ఇల్లు యాజులుగారిది. పిత్రార్జితం. గోదావరి స్నానఘట్టాలకి రెండు కిలోమీటర్ల లోపునే ఉన్న ఆ ఇంటిని అపార్టుమెంట్లు కట్టడానికి ఇవ్వమంటూ బిల్డర్లు ఆయన చుట్టూ చాలాసార్లే తిరిగారు. యాజులుగారికి ఆడపిల్లలు లేరు. ముగ్గురూ కొడుకులే. పెద్దవాడు నేవీలో పెద్ద ఆఫీసరు. రెండోవాడు అమెరికాలో డాక్టరు. మూడోవాడు ఇంజనీరు. వాళ్లు కూడా అపార్టుమెంట్లకిచ్చేస్తే లక్షలొస్తాయని  ఉత్సాహపడ్డారు. కాని యాజులుగారు ఒప్పుకోలేదు.

          ఒక సంవత్సరం పనిగట్టుకుని ముగ్గురు కొడుకుల్నీ పండక్కి పిలిచి కూర్చోబెట్టి, ఇలా చెప్పడం సాగించారు.. 

   ‘‘ఒరేయ్‌, నా మనసులో మాట చెబుదామనే మిమ్మల్ని ముగ్గుర్నీ రమ్మన్నాను. చుట్టూ పచ్చని చెట్లూ, పెరట్లో గోశాలా, తులసికోటా..నట్టింట్లో దేవుడి మందిరమూ...యజ్ఞవాటికలాంటి ఈ ఇంటిని జైలుగదుల్లాంటి అపార్టుమెంట్లకి ఇవ్వడం నాకిష్టం లేదురా! నీ జీవితం అయిపోయింది కదా నాన్నా అంటారేమో...నిజమే, నా జీవితం అయిపోతోంది గానీ ఈ ఇల్లు ఉంటుంది కదా. మా తదనంతరం మీరు ముగ్గురూ ఈ ఇంట్లో సహజీవనం చెయ్యాలన్నది నా కోరిక!’’

   ‘‘మేమా...ఇక్కడా...’’ కొడుకులు ముగ్గురూ అరిచినంత పని చేశారు.

  ‘‘అవును. మీరు ఇష్టపడాలే గాని అందులో అసాధ్యమైనది ఏమీ లేదు. మీరు ముగ్గురూ నచ్చిన చదువులు చదువుకుని, తలోచోటా ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. నేను ఏనాడూ మిమ్మల్ని ఇక్కడికి వచ్చి ఉండమని కనీసం అడగను కూడా అడగలేదు. జీవితంలో ఎదగాలనుకుంటున్న వాళ్లని నా పిచ్చి చాదస్తంతో ఆపేసే మూర్ఖుణ్ణి  కాను. ఇప్పటిదాకా మీ బతుకుల్ని మీ ఇష్టప్రకారమే నడుపుకున్నారు. మీ పిల్లలు కూడా ఎదిగొచ్చేశారు. మీరు వార్థక్యపు అంచుల్లో ఉన్నారు. రేపో మాపో రిటైరవుతారు. మరిక ఎక్కడో దూరంగా బతకాల్సిన అగత్యం ఏముంది మీకు?! ఇన్నాళ్లూ ధనసంపాదనలో కాలం గడిపారు. ఇహం కోసం కష్టపడ్డారు. ఇక వానప్రస్థాశ్రమం స్వీకరించి, పరం కోసం నిరాడంబరమైన సహజీవనం చెయ్యొచ్చు కదా. సొంతగూటికి వచ్చి, గోదావరిలో పవిత్ర స్నానాలు చేస్తూ, మీకు ఈ పాటి జీవితాల్నిచ్చిన ఆ మార్కండేయస్వామిని దర్శించుకుంటూ, పెరట్లో గోమాతని పూజించుకుంటూ, ఈ విశాలమైన ఇంట్లో, పచ్చని ప్రకృతి మధ్య హాయిగా కలిసీ మెలిసీ ఉమ్మడిగా బతకలేరా?! మన ఇంటిలాంటి విశాలమైన ఇళ్లు ఇప్పుడు కేవలం ధనవంతులకి మాత్రమే ఉన్నాయి. మధ్యతరగతివాళ్లంతా ఒక పువ్వూ పండుకి నోచుకోక, అపార్టుమెంట్లలోనే ఇరుకు బతుకులు బతుకుతున్నారు. మీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి?!’’ 

           తండ్రి మాటకు ఏమని జవాబు చెప్పాలో కొడుకులు ముగ్గురికీ అర్థం కాలేదు. మావగారి మాటలు వింటున్న  కోడళ్లు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారే గాని పెదవి విప్పి ఏమీ మాట్లాడుకోలేదు. వాళ్లందరి మౌనానికీ ఒకటే కారణం...యాజులుగారి మీదున్న గౌరవం. కొడుకుల సంగతి అలా ఉంచితే కోడళ్లు ముగ్గురికీ కూడా మావగారి పద్ధతులూ, ఆయన మంచితనం అంటే చాలా గౌరవం. మావగారి ఎదుట ఒదిగి ఉంటూ, అత్తగార్ని కూచోబెట్టి నడుం బిగించే కోడళ్లే ముగ్గురూ. దానికి తగినట్టే పెద్దకోడలి చేతి వంకాయ కూరా, రెండో కోడలు చేసే పెసరపప్పు పచ్చడీ, మూడో కోడలు కలిపే కాఫీ అంటే యాజులుగారికి చాలా ఇష్టం. ఆయన ఆప్యాయంగా ‘‘అమ్మా’’ అని పిలుస్తూ వాళ్లని అడిగి మరీ ఆ మూడూ చేయించుకుని తృప్తిగా ఆస్వాదిస్తారు. యాజులుగారు అడగకుండానే కోడళ్లు అవి చేసి కన్నతండ్రికి పెడుతున్నంత ఆనందంగా ఆయనకి కొసరి కొసరి వడ్డిస్తారు.

      కొడుకులు నిశ్శబ్దంగా ఉండటం చూసి యాజులుగారే మళ్లీ అన్నారు...‘‘పక్షులు ఆహారం కోసం రోజంతా బైట తిరిగి సాయంత్రానికి గూటికి చేరినట్టే మీరు కూడా మీ వానప్రస్థానికి సొంత గూటికి చేరితే బావుంటుంది! ఆధునిక సదుపాయాలు ఇప్పుడు సర్వత్రా ఉంటున్నాయి. పూర్వంలా కష్టపడవలసిన అవసరం ఎవరికీ లేదు. అటువంటప్పుడు, వయసు మళ్లిన అన్నదమ్ములు సొంత ఊళ్లో సొంతింట్లో కలిసి కాపురాలు చేస్తే అటు ఆర్షధర్మమూ ఇటు కుటుంబవిలువలూ రెండూ చిరకాలం నిలబడతాయి!’’

    ఈసారి కొడుకులు ముగ్గురూ తలలు వంచుకుని మరీ మౌనం వహించారు. కోడళ్లు వంటింట్లోకి తప్పుకున్నారు.

        ఇది జరిగిన మూడేళ్లకి...ఇప్పుడు యాజులుగారు శివైక్యం చెందారు. సావిత్రమ్మగారు భర్తని తన గుండెల్లోకే ఆవాహన చేసుకుని నిశ్శబ్దంగా, కళ్లు మూసుకుని సమస్తమూ త్యజించినదానిలా ఉండిపోయింది.

        పన్నెండు రోజుల కర్మ పూర్తయింది.

      పన్నెండోరోజు సంతర్పణకి ఊరు ఊరంతా కదిలి వచ్చింది. తాము పిలవని వాళ్లంతా కూడా రావడం చూసి కొడుకులు ఆశ్చర్యపోయారు. ‘‘కడసారి పంతులుగారింటి ముద్ద తింటాం...గుప్పెడన్నం పెట్టించండి బాబూ’’ అంటూ తీర్థప్రజలా వస్తున్నవారిని కాదు పొమ్మనలేక మళ్లీ మళ్లీ వండిరచి పెట్టారు. రాత్రయేసరికి అందరూ సెలవు తీసుకోగా కేవలం కొడుకులూ కోడళ్లే మిగిలారు.

   ‘‘పూర్ణక్కా, ఈ రోజు భోజనానికి బిల్డర్‌ నరేంద్ర వచ్చాడు చూశావా...బావగారితో పావుగంట మాట్లాడాడు!’’ మూడో కోడలు పెద్దకోడలు అన్నపూర్ణతో అంది

  ‘‘చూశాను. ఆ మాటలేవిటో విన్నాను కూడా!’’ అంది అన్నపూర్ణ 

       మర్నాడు ఉదయం కాఫీల వేళ, ‘‘అమ్మా...ఎల్లుండి ఫ్లైట్‌కి టిక్కెట్లు తీస్తున్నాను. నువ్వు కూడా మాతో వచ్చేద్దువు గాని!’’ అన్నాడు పెద్ద కొడుకు కేశవ తల్లితో 

   ‘‘నేను రానురా. ఇక్కడే ఉంటాను. కాంతమ్మగారు నాకు తోడుగా ఉంటుంది. మీరు నిష్పూచీగా వెళ్లండి!’’ అంది సావిత్రమ్మగారు

    ‘‘కాంతమ్మగారక్కర్లేదత్తయ్యా...మేం ముగ్గురం ఉంటున్నాం మీకు తోడు!’’ అత్తగారికి కాఫీ గ్లాసు అందిస్తూ అంది పెద్దకోడలు అన్నపూర్ణ

         ఆ మాటకి కేశవతో బాటు నారాయణా, మాధవా కూడా విస్తుపోయారు.

   అత్తగారి ఎదురుగానే భర్తవైపు సూటిగా చూస్తూ ప్రారంభించింది అన్నపూర్ణ...‘‘సంతర్పణ భోజనం పేరుతో మిమ్మల్ని కలుసుకుని బిల్డర్‌ నరేంద్ర ఏం మాట్లాడాడో, మీరు ఏమని జవాబు చెప్పారో అంతా నేను విన్నాను. నా చెల్లెళ్లిద్దరికీ కూడా చెప్పాను. మీరు ముగ్గురూ అనుకుంటున్నట్టు మావయ్యగారి సంవత్సరీకాలు అయిపోయిన తర్వాత ఈ ఇల్లు బిల్డర్‌కి అప్పజెప్పే మాట కల్లో కూడా జరగదు. ఈ పన్నెండు రోజులూ మీ ఖర్చుతో జరిపించామని, భేషుగ్గా దానాలిచ్చామని మీరు అనుకుంటున్నారు. కాని నిజానికి ఇన్నాళ్లూ శ్రమదానమూ వస్తుదానమూ చేసింది ఊళ్లో ఉన్న పేదవాళ్లు. వాళ్ల దానం పుచ్చుకున్నది మీరు. రెక్కాడితేనే గాని డొక్కాడని వాళ్లంతా మావయ్యగారి దగ్గర పొందిన ఉపకారాన్ని గుర్తుంచుకుని ఎంతెంత చేశారో లెక్క లేదు. ఆఖరికి మంత్రం చెప్పిన సూరిశాస్త్రి కూడా నామకః వెయ్యి రూపాయలు మాత్రం తీసుకుని వెళ్లాడు. మనిషి లేకపోయినా ఆయన చేసిన ఉపకారాన్ని వాళ్లు అంతలా గుర్తుంచుకుని, ఆయన నేర్పిన విలువల్ని పాటించి చూపించారు. మాకు కూడా వాళ్ల వల్లే బుద్ధొచ్చింది. కడుపున పుట్టిన కొడుకులు..మీరు మాత్రం ఏదీ పట్టించుకోకుండా, మనిషి కనుమరుగయిందే చాలని మావయ్యగారి కోరికా, ఆయన చేసిన హితబోధా అన్నిటినీ గంగలో కలిపేసి స్వార్థం చూసుకుంటున్నారు. అందరూ మీలాంటి స్వార్థపరులు కాబట్టే ప్రపంచంలో ఎక్కడా పెద్దలు నేర్పిన విలువలు కనిపించడం లేదు. ఇక్కడ మాత్రం మేం మీ ఇష్టాన్ని సాగనివ్వం. అత్తయ్య ఎక్కడికీ రారు. మేం కూడా ఆవిడతో బాటూ ఇక్కడే ఉంటాం. మీరు ముగ్గురూ వచ్చారా కలిసి కాపురం చేస్తాం. లేదంటే మీరక్కడ...మేమిక్కడ!’’

     మిగిలిన ఇద్దరు కోడళ్లూ తాము కూడా పెద్దకోడలి పక్షమే అన్నట్టు నిశ్శబ్దంగా ఆమె పక్కకి వచ్చి నిలబడ్డారు.

         కొడుకులు ముగ్గురికీ తలలు పైకి లేవలేదు. ఒక పది నిమిషాలు పోయాక, పెద్ద కొడుకు కేశవ తల్లి దగ్గరగా వచ్చి కూర్చుని అన్నాడు...‘‘అమ్మా, నాన్న కోడళ్లని గెలుచుకున్నారు. కోడళ్ల చేతే కొడుకులకి బుద్ధి చెప్పిస్తున్నారు. నా నిర్ణయం చెబుతున్నాను విను...నాకింక నాలుగేళ్లే ఉంది సర్వీసు. అంచేత ఇప్పుడు వెళ్లి వాలంటరీ రిటైర్మెంటుకి దరఖాస్తు పెట్టుకుని వచ్చేసి మీతో బాటు ఇక్కడే ఉంటాను! పేదవాళ్లని ఆదుకునే విషయంలో నాన్న వారసత్వాన్ని అందిపుచ్చుకుంటాను....’’

     కేశవమాటలు పూర్తిగాకుండానే నారాయణ అందుకున్నాడు...‘‘నేను అమెరికాలోనే వైద్యం చెయ్యక్కర్లేదు. రాజమండ్రీలోనూ చెయ్యొచ్చు. అమెరికా సుఖాలకి అలవాటు పడ్డ నా పెళ్లామే ఇక్కడ  ఉండటానికి సిద్ధపడుతూ ఉంటే నేను అమెరికాలో ఉంటానా...ముక్కామల సోమయాజులుగారి అబ్బాయిని కానా...?! నాన్న పేరిట ఇక్కడే ఒక ఆస్పత్రి ప్రారంభిస్తాను. నేనూ ఇక్కడే!’’

     నారాయణ మాటలు పూర్తి అయీ గాకుండా మాధవ వచ్చి తల్లిని ఆనుకుని కూర్చున్నాడు...‘‘కడసారపు కందిగింజనని అమ్మకి నేనంటే ముద్దు. నేను లేకుండా ఎలారా...నేనిక్కడ ఒక కన్సల్టెన్సీ పెట్టుకుంటా! నాన్న పేరిట ప్రతి ఏడాదీ పేదవాళ్లందరికీ భోజనాలు పెడతా!’’    

             అప్పుడొచ్చింది సావిత్రమ్మగారికి దుఃఖం...కొడుకుల మాటల వెనుక నుంచి చిరునవ్వుతో ఠీవిగా దర్శనమిస్తున్న భర్తని చూసి ఆవిడ భోరుమంది!

       ఆ వృద్ధురాలిని ఓదారుస్తూ ఆరు జతల చేతులు ఆవిడ చుట్టూ చిక్కగా మమతల పందిరి అల్లేశాయి!!     

         

                                      *********************