8, ఫిబ్రవరి 2014, శనివారం

మా హిప్పీ తాతగారు

                         మా తాతగారు (పితామహులు) సూర్యనారాయణగారు. తూర్పుగోదావరి జిల్లా తుని దగ్గర కోటనందూరు స్వస్థలం. అక్కడ ఓ చిన్న ఇల్లు ఉండేది. నాన్న గాని, తాతగారు గాని నన్ను అక్కడికి ఎప్పుడూ  తీసికెళ్లలేదు. ఏమిటో...చేతిలో ఉన్నంతసేపూ విలువ తెలీదంటారే..అలా నేనూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎక్కడా ఏ ఆస్తులూ లేవు. సరే అదలా ఉంచితే, రమణగారు తన కోతి కొమ్మచ్చిలో చెప్పినట్టు...ఇప్పుడు సందర్భవశాత్తూ మా అమ్మా నాన్నల కధ లోంచి తాతామామ్మల లవ్ స్టోరీ లోకి ముందు దూకడం అవశ్యం.   
                                             మా నాయనమ్మ బొట్టువారి ఆడబడుచు. అక్కడ ఎంతమంది మధ్యన పుట్టిందో గాని, పిల్లలు లేని నడిమింటి వెంకట జోగయ్యగారికి దత్తు వెళ్లింది. దత్తు అంటే ఆయన చేరదీసి పెంచుకున్నారు.. అంతే. ఆయనకి ఎటూ పిల్లలు లేరు కాబట్టి ఉన్న  ఇత్తడి గంగాళాలూ...బిందెలూ కేరేజీలూ (అన్నీ ఇత్తడివే...పుత్తడి కాదు) వగైరాలన్నిటికీ ఆవిడొక్కతే వారసురాలైంది.తాతగారు ఆవిడకి బావ. మరి బంధుత్వం ఏ రకమైనదో నాకు వివరం తెలీదు. అంటే ఆవిడ కన్నవారి వైపు బంధువా లేక పెంచుకున్నవారికి చుట్టమా అన్నది. ఏమైతేనేం...బావామరదళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. మామూలుగా అయితే హాయిగా పెళ్లి చేసెయ్యొచ్చు. కాని తాతగారి స్థితిగతులూ..ఆయన వ్యవహారాలూ జోగయ్యగారికి అడ్డొచ్చాయి. తాతగారు మొత్తం ఆరుగురున్న కుటుంబంలో రెండో సంతానం. ఆయనకి ఒక అక్క, నలుగురు తమ్ముళ్లు. కూతురికి పెళ్లి చేశాక మా తాతగారి తండ్రి ముక్కామల సరవయ్య గారు స్వర్గస్థులయ్యారు.మొగుడు చచ్చిపోతే ఆడదానికి పదోరోజు దాకా పసుపూ కుంకుమా తియ్యరు కదా..మా తాతగారి తల్లికి పసుపు కుంకుమలతోనే పోవాలన్నది ఒక ప్రగాఢవాంఛ. అంచేత మొగుడు పోయిన మూడో రోజు రాత్రి  ఆవిడ ఎంచక్కా వెళ్లి నూతిలో దూకేసింది. దాంతో  తాతగారు ఒకేసారి తల్లీదండ్రీ లేని అనాధ అయిపోయారు. ఆస్తిపాస్తులా పూజ్యం. చదువా సున్నా..వెనకాల చూస్తే నలుగురు తమ్ముళ్లు. అయినా పాపం జోగయ్యగారు వెనకాడలేదు. మేనల్లుణ్ణి తెచ్చి దగ్గర పెట్టుకుని చదివిద్దామని చూశారు. కాస్త పొట్టలోకి నాలుగక్షరమ్ముక్కలు వెళితే వాడి కాళ్లూ వీడి కాళ్లూ పట్టుకుని ఏదో ఉద్యోగం వేయించి అప్పుడు  పిల్లనిచ్చి పెళ్లి చెయ్యాలన్నది ఆయన సదాలోచన. కాని ఈయన లొంగితేనా...??  మా తాతగార్ని సంగీత సరస్వతి చల్లగా చూసింది గాని చదువులమ్మ మాత్రం వెక్కిరించి వదిలేసింది. మళ్లీ ఆయన నిరంతర పాఠకుడు. ఎప్పుడు చూసినా ఏదొ ఒకటి చదువుతూనే ఉండేవారు. తను చదివినదాన్ని విశ్లేషాత్మకంగా నాకు చెబుతూనే ఉండేవారు. మరి అలాంటి మనిషికి చదువు ఎలా అబ్బలేదో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే.అయితే ఆయనకి చదువు అబ్బకపోవడానికి గల కారణాల్ని చూస్తే మనకి విషయం ఇట్టే బోధపడిపోతుంది.  
                                ఈ కాలపు కుర్రాళ్లలో కొందరు తెలివితేటలున్నప్పటికీ సినిమాలూ, షికార్లు మరిగి చదువుని ఎలా అశ్రద్ధ చేస్తున్నారో అప్పట్లో మా తాతగారు కూడా అలాగే చేశారు. ఆయన స్నేహితుల్లో క్షత్రియులే ఎక్కువ. నాకు రాజులంటే  (కేవలం ఒకప్పుడు రాజ్యాలేలిన రాజులే కాదు క్షత్రియ కుల సంజాతులు) అపరిమితమైన అభిమానం కలగడానికి పూర్తి కారణం మా తాతగారే. ఆయన రాజులతోనే ఎక్కువగా స్నేహం చేసేవారు. వాళ్లతో కలిసి గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. మరి చేత్తో ఏ ఆయుధాలు పట్టుకునేవారో గాని ఆ రాజుల కుర్రవాళ్లూ, మా తాతగారూ కలిసి రాత్రివేళల్లో వేటకి వెళ్లిపోయేవారు. రాత్రంతా వేటాడటం..తెల్లారి ఇంటికి వచ్చి పగటిపూట పనులన్నీ ఎగ్గొట్టి హాయిగా నిద్దరోడం.     
                                   అక్కడితో అయిందా..."భువనవిజయం" లో పెద్దన కాబోలు మధ్యాహ్నం భోజనం చేసి పడుకుని నిద్రపోయి లేచి సంపంగి వాసన నూనె రాసి తల  దువ్వుకుని సన్నజాజుల మాలతో అలంకరించుకుని బైటకి వస్తాడు...అలా మా తాతగారు  తన  శిరోజాల్ని తన మరదలి (మా నాయనమ్మ) కంటే శ్రద్ధగా పెంచుకునేవారు..దాంతో బాటే మీసాలూ.  మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టు నిజంగానే మింగ మెతుకు లేని పరిస్థితిలో ఆ శిరోజాలన్నిటికీ సంపంగి నూనె రాసి శ్రద్ధగా చూసుకుంటూ ముడి వేసుకునేవారు. దాంతో జోగయ్యగారి కోపం నసాళానికంటింది. పొట్ట చీలిస్తే అక్షరమ్ముక్క లేకపోగా ఈ  హిప్పీ  వేషాలన్నీ ఆయనకి వెర్రెక్కించాయి. ఓ రోజు ఇద్దరు పనివాళ్లని పిలిచి ఒరేయ్...వాణ్ణి కదలకుండా పట్టుకోండిరా అని మేనల్లుణ్ణి బాహుబంధితుణ్ణి చేసి మంగలిని పిలిచి శుభ్రంగా అంటకత్తెర వేయించేసి సగం కోపం తీర్చుకున్నారు. అంతే...మంగలి పని పూర్తయిన ఉత్తరక్షణంలో మా తాతగారు అక్కడ లేరు...ఆ ఇంట్లోనూ లేరు. నెలల తరబడి తను ముద్దుగా పెంచుకున్న జుత్తునంతటినీ ఒక్క కత్తెర వేయించేసిన మేనమామని పైకి ఏమీ అనలేక...కోపం, ఉక్రోషం ఆపుకోలేక మరుక్షణంలో తన  ఊరికి  పారిపోయారు...:)   
          మరి ఆ తర్వాత ఏమైందో ఇంక రేపే చెప్పుకుందాం...ఓకే...ఇంక ఈ రోజుకు సెలవు. 
                                              ఇక్కడ  కొసమెరుపేమంటే తన జుత్తు కత్తిరింపించేసిన మేనమామ...(తర్వాత మావగారు) అంటే మా తాతగారికి తొంభయ్యేళ్ల వయసులో కూడా కోపం పోలేదు. "ఆ ముండాకొడుకు నా జుత్తంతా కత్తిరింపించేశాడు.." అంటూ ఆయనే నాకు ఇవన్నీ చెప్పుకొచ్చారు. మొగుడు తన తండ్రిని తిడుతూ ఉంటే మా నాయనమ్మ ఏమీ అనేది కాదు సరికదా...కిసుక్కున నవ్వేది...అంటున్నది లవరు కదా మరి...:)     ఓకే బై...

4 కామెంట్‌లు: