12, మార్చి 2014, బుధవారం

నేనూ-జగన్నాధుడూ..

సంసార సాగరంలో నిండా మునిగిపోయి ఉన్నాను. 

           వెనకటికి ఎవరో సరిగ్గా గుర్తు లేదు గాని..(బహుశా నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రిగారేమో) పూరీలో దారువిగ్రహ రూపంలో అవతరించిన జగన్నాధస్వామి మీద ఇలా శ్లోకం చెప్పారట...
 ఏకా భార్యా ప్రకృతిరచలా  చంచలా సా ద్వితీయా 
 పుత్రోనంగస్త్రిభువనచరీ మన్మధో దుర్నివారః 
  శేషశ్శయ్యా ప్యుదధిశయనం వాహనం పన్నగారిః 
 స్మారం స్మారం స్వగృహచరితం దారుభూతో మురారీ...
                 విష్ణుమూర్తికి ఒకరు కాదు ఇద్దరు భార్యలు. హాయిగా ఇద్దరితోనూ ముచ్చట్లాడుకుంటూ ఖులాసాగా ఉందామంటే మాత్రం  "ఏకా భార్యా ప్రకృతిరచలా.." మొదటి భార్య భూదేవి అచల. పెళ్లిపుస్తకంలో రాజేంద్రప్రసాద్ చెప్పినట్టు "చలించదు..క్షమించదు". తిట్టినా..ముద్దాడినా..ఏం చేసినా ఒకటే నిర్వికార స్వరూపం.  పోన్లే ఈవిడ కాకపోతే ఆవిడ ఉంది కదా అనుకుంటే ఆ రెండో భార్య శ్రీ మహాలక్ష్మి సృష్టికంతటికీ బహు గొప్ప చంచల స్వభావురాలు. ఏ క్షణం దగ్గరుంటుందో..ఏ క్షణం లేచి చక్కా పోతుందో ఆవిడకే ఎరుక. ఇహ ఆ మహాతల్లితో ఏం సుఖం..? పోన్లే..పెళ్లాల వల్ల సుఖం లేకపోయినా పిల్లల్ని చూసుకుని ఆనందిద్దామంటే ఉన్న ఒక్కగానొక్క కొడుకు..ముల్లోకాల్లోనూ ఎదురే లేనివాడు..సమస్త ప్రపంచాన్నీ జయించగల శక్తిమంతుడు మన్మధునికి శరీరమే లేదు..అవయవాలు లేని బిడ్డ వాడు...హ్మ్మ్..పోనీ ఇవన్నీ ఎలా ఉన్నా ఇంట్లో కాస్త సుఖంగా బతకగలిగే సౌఖ్యాలున్నాయా అంటే పాము పక్క..ఎప్పుడది బుస్సుమంటుందో తెలీదు...ఆ పాము కూడా సముద్రమధ్యంలో తేలుతోంది.ఖర్మ కాలితే మునిగిపోవడమే. పోనీలేవయ్యా వాహనమైనా ఏ అమితాబ్బచ్చన్ కారు లాంటి కారో ఉందా అంటే పాముల్ని తినే పక్షి వాహనం. 
                     ఇల్లు-ఇల్లాళ్లు-బిడ్డలు-సౌఖ్యాలు అన్నీ ఇంత కమ్మగా ఉంటే ఇక ఏం చూసుకుని ఆనందించమంటావయ్యా...స్వగృహ చరితాన్ని తలచుకుని తలచుకుని కొయ్యయిపోయాట్ట స్వామి. ఆ కొయ్యే పూరీ జగన్నాధుడు. 
            "లోకబంధుర్లోకనాధు"డైన పురుషోత్తముని గతే ఇలా ఉంటే ఇక బీచ్ లో ఇసుకరేణువులాంటిదాన్ని నా గతేమిటి...???? 
 కాబట్టి...సెలవు...:) :) :) 
                        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి